ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేరా’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జునలు ప్రేక్షకుల స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ముఖ్యంగా రన్టైమ్ (నిడివి) పై వస్తున్న కామెంట్స్ పై శేఖర్ కమ్ముల ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు.
“చిన్నదైపోతే కథే తప్పిపోతుంది” – శేఖర్ కమ్ముల
‘‘ఇది నాకొక ఎమోషనల్ టైమ్. మేము ఈ కథ అనుకున్నప్పటినుంచి వాస్తవికతకు దగ్గరగా తీయాలనుకున్నాం. అనుకున్న దానికంటే బడ్జెట్ మించిపోయినప్పుడల్లా కథలో ఏదైనా కోతలు విధించాలనుకునేవాడిని. ఆ సమయంలో నా టీమ్ నాకెంతో సపోర్ట్గా నిలిచింది. ఈ సినిమాను ఇలాగే రూపొందించాలని ధైర్యాన్నిచ్చింది. ఇప్పటివరకూ నేను చేసిన చిత్రాల్లో ఇది అద్భుతమైన చిత్రం. నిడివి విషయంలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అవసరమైనప్పుడు సినిమాకు కత్తెర వేయాలనేది దర్శకుడు లేదా టీమ్కు తెలియని విషయం కాదు. కానీ, ఆయా సన్నివేశాలు ఉండాలి, చెప్పాలనుకున్నప్పుడు దానిని ఆవిధంగా రూపొందించడమే ధర్మం. ఈ సినిమాకు ఇది అవసరం. ఇందులో ఎన్నో కోణాలు ఉన్నాయి. సినిమా విషయంలో గర్వం, సంతోషంగా ఉన్నా. ఇదొక కంప్లీట్ ఫిల్మ్. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు సాగదీతగా ఉందని అనుకోరనుకుంటున్నా’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు.